Tuesday, 24 April 2012

మన పాబ్లో నెరుడా

కె.జి. సత్యమూర్తి గారు ఇక లేరు అనే వార్త విన్నప్పుడు 40 ఏళ్ళ నాటి జ్ఞాపకాలు చుట్టూ ముసురుకుని మనసును కలిచివేసినై. సంవత్సరం సరిగా గుర్తులేదు. 1966 అనుకుంటా. స్టేట్ టీచర్స్ యూనియన్, ఎన్‌జిఓ యూనియన్లు కలసి తమ హక్కుల సాధన కోసం నెలరోజులకు పైగా సమ్మె చేసినై. సమ్మెలో భాగంగా ఒక రోజు హనుమకొండ జీవన్‌లాల్ గ్రౌండ్స్‌లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటైనది. ఉద్యమ నాయకుల ఉపన్యాసాల మధ్య కొందరు పాటలు, కవితలు వినిపించారు.

నేనూ ఒక కవిత చదివాను. జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వేదిక దిగగానే తెల్ల దుస్తుల్లో ఒకాయన నా దగ్గరకు వచ్చి 'నా పేరు సత్యమూర్తి. గేబ్రియల్స్ హైస్కూల్ టీచర్‌ని. ఈ సభ చివర్న స్నేహితులతో కలసి ఒక నాటిక ప్రదర్శించబోతున్నాను. మీరు చూసి అభిప్రాయం చెప్పండి' అన్నారు. అలా మొదలైంది మా స్నేహం. మా ఆలోచనలు, అభిరుచులు, అన్నింటినీ మించి ఆయన మాటలలోని ఆత్మీయత క్రమంగా మమ్మల్ని ఎంతో సన్నిహితుల్ని చేసినై. ప్రాపంచిక జ్ఞానం, చారిత్రక అవగాహన, మార్క్సిజం వెలుగులో అనేక సమస్యలపై ఆయన విశ్లేషణలు, ఎదుటివారి మీద ప్రగాఢ ముద్ర వేసేవి.

అణగారిన జనం మీద అపారమైన ప్రేమ, అన్యాయం మీద ఆగ్రహం, దాడి ఆయన వ్యక్తిత్వ ప్రధాన లక్షణాలు. అందుకే సుదీర్ఘకాలం ఆయన సాయుధపోరాట యోధుడైనాడు. పీడిత జనంతో మమేకమై పోరాటంలో ఉన్న వారు రచయితలైతే ఎంత అద్భుత సాహిత్యం వస్తుందో 'శివసాగర్' ఒక సజీవ ఉదాహరణ. విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చిన సత్యమూర్తి ఆలోచనల్ని నేను విశ్లేషించలేను కాని, ఆయన ఎక్కడో ఆగిపోయిండని అనుకోను. ఇవ్వాళ్టి సంక్లిష్ట సంక్షోభాల నడుమ, అమానుష అణచివేతల మధ్య నిత్య పరాయీకరణ విధ్వంసాల మధ్య గమ్యం చేరి ఏవేవో మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోయిన బాటసారి అనుకుంటాను.

సత్యమూర్తి ఖాజీపేట దగ్గర ఫాతిమానగర్ గేబ్రియల్స్ హైస్కూల్‌లో పనిచేసిన రోజులు అప్పుడక్కడ పనిచేసిన అధ్యాపకులకు, చదివిన ఎందరో విద్యార్థులకు బాగా గుర్తుండిపోయిన రోజులు. గేబ్రియల్స్ హైస్కూల్ మంచి పేరున్న పాఠశాల. అయినా అంతర్గతంగా ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనల అమలు విషయంలో యాజమాన్యం కొంత అప్రజాస్వామికంగా, హై హ్యాండెడ్‌గా ఉండేదని విన్నాం. అధ్యాపకులు అనేక సందర్భాల్లో తమ న్యాయమైన హక్కులను అడగడానికి కూడా జంకేవారని, సర్వీస్ రిజిస్టర్లు కూడా ఉండేవి కావని చెప్పుకునేవారు.

అలాంటి పరిస్థితుల్లో సత్యమూర్తిగారు కలిగించుకుని ఉపాధ్యాయులను ఏకంచేసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వారికి రావలసిన అన్ని సౌకర్యాలను చాలా వరకు సాధించి సర్వీస్ రిజిస్టర్లు కూడా ఏర్పాటు చేయించారని తెలిసింది. ఆ విధంగా ఆయన అక్కడ తన సోదర అధ్యాపకులకి ఒక 'వాయిస్' ఇచ్చి గౌరవపూర్వకమైన ఉనికిని కల్పించారు. ఆ పాఠశాల నుంచి రిటైరైన ఎందరో ఉపాధ్యాయులు సత్యమూర్తిగారి పేరును ఎంతో పూజ్య భావంతో ఉచ్ఛరించడం నేను విన్నాను.

ఒక ఉపాధ్యాయుడు ఉద్యమ శీలుడైతే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఊహించలేం. a teacher does not know where his influence stops' ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గణనీయమైనది.

టీచర్‌గా సత్యమూర్తి చాలా క్రియేటివ్. చాలా మంది అధ్యాపకుల్లాగా పాఠ్య పుస్తకాల పేజీల వరకే పరిమితం కాకుండా పాఠ్యాంశాలకు అనేక జీవితానుభవాలు, ప్రాపంచిక విషయాలు జోడించి తన విద్యార్థులను ఒక విశాల జగత్తులోకి తీపసుకెళ్ళేవారు. సత్యమూర్తి టీచింగ్ ఎంతో లైవ్లీగా ఉండేదని ఆయన శిష్యులు చెప్పేవారు. a teacher trying to teach his puplis without inspiring them is hammering on cold iron'. ఆయన వ్యక్తిత్వ ప్రభావం పిల్లలపై ఎంతగానో ఉండేది.

పాఠశాలను సమాజంలో విస్తరింప జేసిన గొప్ప అధ్యాపకుడు, విజనరీ సత్యమూర్తి. ప్రతిష్ఠాత్మక వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల మీద ఆయన ప్రభావం ఎంతటిదో సమాజం కోసం ప్రాణాలర్పించిన సూరపనేని జనార్ధన్ లాంటి అనేకులను గుర్తు చేసుకుంటే అర్థమౌతుంది. నిజమైన విప్లవకారుడు ఎంత మృదుభాషిగా ఉంటాడో, మనసు ఎంత నవ్య నవనీత సమానమో సత్యమూర్తిగారితో పరిచయమున్న వారందరికీ తెలుసు. ఆయన తిరిగిన వాడలకీ, నడచిన అడవి బాటలకీ, కలిసిన అశేష అభాగ్య జనానికి తెలుసు.

1976 ఎమర్జెన్సీ-విప్లవకారులతో పాటు ఎందరో విప్లవ రచయితలను జైళ్ళలోకి నెట్టిన చీకటి రోజులు. నేనప్పుడు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నా. విశాఖ జైలు నుంచి అనుకుంటా సత్యమూర్తి గారిని ఏదో కేసు విషయంలో వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చినప్పుడు ఒక రోజు ఆయన్ని వరంగల్ జైల్లో ఉంచారు. జైలు జవాన్లు ఆయనను ఒక బ్యారక్ నుంచి ఇంకో బ్యారక్‌కు తీసుకు వెళ్తున్నప్పుడు నేను కనపడితే ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.

మావో చనిపోయి అప్పటికి రెండు మూడు రోజులు అయి ఉంటుందనుకుంటాను. జైల్లో ఒక గోడ పక్కన ఒక మందారపు మొక్కను చూపుతూ 'చూశారా అక్కడ ఒక పువ్వు రాలిపడి ఉంది. చెట్టు మీద ఒక మొగ్గ విచ్చుకుంటున్నది. మావో మరణంతో విప్లవం ఆగిపోదు. కొత్తతరం ఆవిర్భవిస్తుందని చాలా సింబాలికల్‌గా కవితాత్మకంగా చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారు.every where essentially he was a poet, a revolutionary and a dremer.

1998లో ఒక కారు ప్రమాదంలో నా ఎడమకాలు విరిగిపోయింది. కదలలేని స్థితిలో దాదాపు ఎనిమిది నెలలు మంచం మీద ఉండిపోయాను. వరవరరావు, జయశంకర్ ఇంకా చాలా మంది మిత్రులు, ఆత్మీయులు పలకరించడానికి వచ్చారు. ఎలా తెలిసిందో సత్యమూర్తిగారు ఓ పది పన్నెండు మంది సహచరులతో కలిసి మా ఇంటికి వచ్చారు. నా మంచం చుట్టూ చేరి దాదాపు ఓ గంటసేపు విప్లవగీతాలతో, మాటలతో నన్ను ఉత్సాహపరచి వెళ్ళిపోయారు.

సత్యమూర్తి గొప్ప పాటలు రాయడమే కాదు. వాటిని తన్మయంగా పాడేవారు కూడా. ఒకరోజు హనుమకొండ కుమార్‌పల్లి వరవరరావు గారింట్లో సాహితీ మిత్రులమంతా కలిసి సత్యమూర్తిగారితో మాట్లాడుతున్నాం. మాటల మధ్య పాటల ప్రస్తావన వచ్చింది. ఎవరో అన్నారు, లోచన్ పాటలు కూడా పాడతాడని. సత్యమూర్తిగారు నన్ను పాడండన్నారు. నాకు కొంచెం బిడియం. ఎంతసేపూ నోరు విప్పకపోయేసరికి సత్యమూర్తి గారే అందుకున్నారు- 'తూర్పు పవనం వీచెనోయ్, తూర్పు దిక్కెరుపెక్కెనోయ్' అని మాంచి మూడ్‌లో అద్భుతంగా పాడారు.

విప్లవోద్యమంలో ఉబికి వచ్చిన అరుణగానం సత్యమూర్తి. పాటకు ప్రాణం పోసి ఎరుపు సొగసులను అద్దిన వాడు. ఆనాడు ఆయన రాసిన 'నరుడో భాస్కరుడా' గొప్ప రెవల్యూషనరీ హిట్ సాంగ్. శ్రీ శ్రీ ఆ గీతాన్ని తన్మయుడై పాడుతుంటే ఒక జీరతో, మానవీయ కంపనతో చెప్పలేని ఒక స్పెషల్ ఎఫెక్ట్‌తో వినిపించేది. సభల్లో. సమావేశాల్లో చుట్టూ గాలి గాలంతా ఎర్రెర్రని ఆర్కెస్ట్రా ధ్వనులతో నిండిపోయినట్లు. ఆ రోజుల్లో గద్దర్, శివసాగర్, వంగపండు పాటలదే హవా. 'తోటరాముని కాటా తగిలిందని' గొంతెత్తి ఎన్‌కె పాడుతుంటే వేలాది జనం ఊగిపోయేవారు. అలా శివసాగర్ అంతటా పాటై ప్రవహించాడు, ప్రతిధ్వనించాడు.

ఆ రోజులను తలచుకుంటే గత కాలమే మేలేమో అనిపిస్తుంది. కాని మనకు తెలుసు చరిత్ర ముందుకే నడుస్తుంది. ఈ భూగోళ గర్భాన్ని తవ్వుతున్న ప్రపంచీకరణ పెనుభూతం ఎంత దీర్ఘకాలమైనా పీడిత జనాగ్రహ జ్వాలల్లో బూడిదై రాలిపోతుంది. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నెన్నో చిన్న చిన్న జ్ఞాపకాలు. విప్లవకవిత్వంలో ఎన్నో ఖాళీలను పూరించిన వాడు శివసాగర్. కవితకు, పాటకు, కొత్త ఎనర్జీని, డిక్షన్‌ను, డైరెక్షన్‌ను ఇచ్చిన వాడు. ఎన్నో బ్యూటీ స్పాట్‌లను అద్దిన అలంకారికుడు.

కలం కార్మికుడు శివసాగర్. అందుకే ఆయన కవిత ఎంతో అందమైనది. ఆయన కమిట్ మెంట్ ఎంతో విలువైనది. ఆయన అన్వేషణ ఆలోచించదగినది. ఆయన నడిచివచ్చాడు, అణగారిన వాడలనుంచి, అణచివేతల దారి నుంచి, కొల్లేరు ప్రకృతి పరిసరాల నుంచి, సుదూర యానం చేశాడు. నెత్తురోడిన రాస్తాల నుంచి, తిరగబడ్డ అడవి ఆగ్రహం నుంచి..

సత్యమూర్తిని గుర్తుచేసుకుంటే చరిత్రను గుర్తుచేసుకున్నట్లు, ఒక అర్థవంతమైన అధ్యాయం చదివినట్టు. మనం శివసాగర్‌ని గుర్తు చేసుకుందాం. ప్రతి క్షణం రణరంగమైన ఈ విధ్వంస మార్గంలో శివసాగర్‌ని తలచుకోకుంటే మనల్ని మనం మరచిపోయినట్లే. 'నరుడో భాస్కరుడా' విన్నప్పుడు ఆ అంటున్నది మన తెలుగు పాబ్లోనెరుడానా అనాలనిపిస్తుంది.

- లోచన్
http://www.epaper.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/22/edit/22edit3&more=2012/apr/22/edit/editpagemain1&date=4/22/2012

No comments:

Post a Comment