Monday, 19 December 2011

కోవర్టు పనే

కరీంనగర్‌ -మేజర్‌న్యూస్‌ప్రతినిధికోవర్టు ఆపరేషన్‌ ద్వారానే మావోయిస్టు అగ్ర నేత కిషన్‌జీని పట్టుకొని చిత్రహింసల అనంతరం కాల్చివే శారని ఎన్‌కౌంటర్‌ ప్రకటన తేటతెల్లంచేస్తోంది. ఈ విషయం పై అన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కిషన్‌జీని చేరుకోవడం అంత ఆషామాషీ వ్యవహరం కాదు. కేవ లం కోవర్టు ఆపరేషన్‌ ద్వారానే సాధ్యమవుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్త చుట్టుభద్రతా వలయం లేకుండా అడవుల్లో సంచరిస్తారనేది సాధ్యంకాని విషయం. ఈ నేపథ్యంలో కిషన్‌జీతోపాటు ఉన్న సభ్యుల్లో ఎవరు కోవర్టనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఐదంచెల వ్యవస్థ దాటి కిషన్‌జీని చేరుకోవడం పోలీస్‌ బలగాలకు సాధ్యంకాని విషయం. అలికిడి అయితే చాలు విఐపిని సురక్షితంగా తరలించే శిక్షణ పొందిన ఆయనకు రక్షణ పది మంది సాయుధులు.

మొత్తంగా యాభై మంది సాయుధుల రక్షణ కవచం కలిగిన మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీని మట్టుపెట్టడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మావోయిస్టు సాంకేతిక, యుద్ధ వ్యూహ రచనలో ఆరితేరిన వారందరూ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ బూటకమేనని ప్రకటన చేశారు. విభిన్న కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో చివరకు కుటుంబసభ్యులు సైతం మానవహక్కుల సంఘానికి ెచేసిన ఫిర్యాదులో ఎన్‌కౌంటర్‌ విషయం నిగ్గుతేలాలని కోరారు. కిషన్‌జీ మృతదేహాన్ని అప్పగిస్తే వైద్యనిపుణుల పరీక్షల ద్వారా బండారం బయటపడుతుందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎల్‌ ఆకారంలో కిషన్‌జీకి రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. నాలుగు వైపులా 27 మందితో కూడిన వ్యక్తిగత భద్రత దళం రాత్రింబవళ్లు కాపలాకాస్తు ఉంటుంది. ప్రతి నాలుగు గంటలకోమారు వీరి విధులు మారుతుంటాయి.

దాదాపు కిలోమీటర్‌ దూరంలో సెంట్రీ పోస్టులు పనిచేస్తుంటాయి. పోలీసు బగాలు కిషన్‌జీని చేరాలంటే ముందుగా సెంట్రీ పోస్టు దాటాల్సి ఉంటుంది. ఆ అలికిడి చాలు కిషన్‌జీని తప్పించేందుకు రెప్పపాటులో పనులు పూర్తిచేస్తారు. పిన్‌పాయింట్‌కు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో మూడు సాయుధ దళాలు మోహరించి ఉంటాయి. నాలుగు దిక్కుల ఉన్న ఈ వలయానికి ఎటు వైపు నుంచి ముప్పు వస్తున్నా వెనువెంటనే ముందుకు సమాచారం వెళుతుంది. ఆ సమాచారం కోడ్‌ ద్వారానే ఉంటుంది. డీకోడ్‌ చేయడం అప్పటికప్పుడు ఎవరికి సాధ్యంకాదు. కరెంట్‌పోయింది చాకలి వచ్చాడు వంటి కోడ్‌భాషను ఉపయోగిస్తారు. వాటిని దళనాయకుడు అప్పటికప్పుడే సెంట్రీకి ఆదేశాలు జారీచేస్తాడు.

ఈ నేపథ్యంలో ఆకోడ్‌ సెంట్రీ దళనేత మధ్యనే దాగి ఉంటుంది. ఈ కారణాలన్నీ పరిశీలిస్తే ఎన్‌కౌంటర్‌ బూటకమని తేలిపోతుంది. మరోవైపు పోలీసుల వాదనను పరిశీలిస్తే కేంద్ర కమిటీ సభ్యుడు కోటేశ్వర్‌ను చేరాలంటే కనీసం యాబై మందిని హతమార్చాల్సి ఉంటుంది. కానీ జంగల్‌మహల్‌ అడవుల్లో అలా జరగలేదు. ముందుగా కిషన్‌జీతోపాటు సుచిత్రామహతో మాత్రమే మృతి చెందినట్లు పోలీస్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఎన్‌కౌంటర్‌ బూటకమనే అనుమానాలకు తావిస్తోంది. కోవర్టు సహకారంతో ముందుగానే మైదాన ప్రాంతంలో పట్టుకొని విచారణ అనంతరం అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ కథనాన్ని అల్లిఉంటారనేది సానుభూతిపరుల వాదన.

ఈ విషయంపై కేంద్ర కమిటీ సీరియస్‌గానే పరిగణిస్తున్నట్లు సమాచారం. కిషన్‌జీని చేరుకోగల సత్తా ఉన్న వారెవరు గత కొంతకాలంగా కాంటాక్ట్‌ ఎవరెవరికి ఇచ్చారు అందులో కోవర్టు ఎవరై ఉంటారు అనే కోణంలో మావోలు ఆరా చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కోవర్టు ఆపరేషన్లను చేధించడం మావోయిస్టులకు పెద్దపనేం కాదు. పోలీసు వర్గాల్లో సైతం మావోలకు సానుభూతిపరులు ఉన్నారు. పలు సందర్భాల్లో ఎన్‌కౌంటర్‌ కారకులను గుర్తించి కాల్చిచంపిన సంఘటనలు ఉన్నాయి. కిషన్‌జీని టార్గెట్‌ చేసిన కోవర్టు కోసం మావోల అన్వేషణ ప్రారంభమయింది.

http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=58379

No comments:

Post a Comment